కన్నా లక్ష్మీనారాయణ పల్నాడు జిల్లా రాజకీయాల్లో కీలకనేతగా ఎదిగారు. మంత్రిగా సీనియర్ రాజకీయ నేతగా పనిచేశారు. ముఖ్యమంత్రి అభ్యర్దిగా ఆయన పేరు కూడా గతంలో వినిపించింది. సుధీర్ఘ రాజకీయ ప్రస్ధానం ఉన్న నాయకుడు. ఆయన ప్రస్తుతం సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశం చాలా తక్కువ అని జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. అందుకే రాజకీయంగా పెద్ద యాక్టీవ్ గా ఆయన ఉండటం లేదని సొంత పార్టీ నేతలు కూడా మాట్లాడుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని కన్నా లక్ష్మీ నారాయణ ప్రారంభించారు. తర్వాత వైసీపీలో చేరుతారు అని వార్తలు వినిపించాయి. అదీ జరగలేదు ఆయన జగన్ దగ్గరకు వెళ్లలేదు. మొత్తానికి ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ఆయనకు బీజేపీ ఇచ్చింది. ఆయన బీజేపీలో చేరి పార్టీని బలోపేతం చేశారు. 2019 ఎన్నికల్లో ఎపీలో బీజేపీ, కన్నా ద్వారా పట్టు బిగించాలి అని భావించింది అది జరగలేదు. కాపు ఓట్లు తమకు మళ్లుతాయి అని భావించింది కమలం పార్టీ అదీ జరగలేదు. ఇక తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. వెంటనే చంద్రబాబు కూడా ఆయనకు 2024 ఎన్నికల్లో సమీకరణాలు ఆలోచించి సత్తెనపల్లి టికెట్ ఇచ్చారు.
ఆయన ఈజీగా గెలిచారు, అయితే సీనియర్ కాబట్టి కచ్చితంగా మంత్రివర్గంలోకి ఆయన్ని తీసుకుంటారు అనే వార్తలు ఆనాడు బలంగా వినిపించాయి. ఆయన అనుచరులు అదే భావించారు కానీ చంద్రబాబు యువ నాయకులకి ఎక్కువగా కేబినెట్ లో అవకాశం కల్పించారు. మరో పక్క జనసేన బీజేపీ కూడా ఈ బెర్తులు పొందాయి. ఇక మళ్లీ కేబినెట్ విస్తరణ జరిగినా కన్నాకు అవకాశం తక్కువ అనే చర్చ సాగుతోంది. ఇక సీనియర్లని పక్కన పెట్టి లోకేష్ కి బాగా సన్నిహితంగా ఉన్నవారు, పవన్ కు అత్యంత దగ్గరగా ఉన్నవారు, యువ నేతలకు మంత్రి పదవులు ఇవ్వాలి అని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఎన్నికలకు మరో రెండు సంవత్సరాల సమయం ఉండగా ఈ విస్తరణ జరిగే అవకాశం ఉంది.
అంబటి రాంబాబు అంశం పెద్ద ఎత్తున చర్చకు వచ్చిన సమయంలో టీడీపీ నాయకులు అందరూ మాట్లాడారు కానీ ఆ సెగ్మెంట్లో ఉన్న కన్నా లక్ష్మీ నారాయణ ఒక్కసారి మాట్లాడి ఆ అంశం నుంచి తప్పుకున్నారు.అక్కడ నుంచి టీడీపీ కేడర్ ఆలోచనలో పడింది. కన్నా తీరుపై వారు అసంతృప్తిగానే ఉన్నారు. కన్నా లక్ష్మీ నారాయణకు ఇదే చివరి ఎన్నికలుగా భావించి ఆయన పెద్దగా యాక్టీవ్ గా ఉండటం లేదని సెగ్మెంట్లో జోరుగా చర్చ సాగుతోంది. మరి చూడాలి రాజకీయంగా ఆయన స్టెప్ ఏ విధంగా ఉండనుందో.

