జనసేన పార్టీలో ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబు పేరు బాగా వినిపిస్తోంది. జనసేన పార్టీలో పవన్ కల్యాణ్ తర్వాత నెంబర్ 2 నాగబాబు, మంత్రి నాదెండ్ల మనోహర్ ఇద్దరు కీలకం అనే విషయం అందరికి తెలిసిందే. జనసేన స్దాపించిన సమయం నుంచి నాగబాబు తమ్ముడు పవన్ కల్యాణ్ కి తోడుగా ఉన్నారు. ఎన్నికల సమయంలో కూటమితో జతకట్టడం వల్ల, నాగబాబు కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది. ఇదంతా తమ్ముడిపై ప్రేమతోనే చేశారు. ఇలా రాజకీయంగా సపోర్ట్ గా నిలిచారు నాగబాబు.
ప్రస్తుతం పార్టీలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయనకు, గత ఏడాది మార్చి 30 న కూటమి సర్కార్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. ఆయన శాసన మండలి సభ్యుడిగా బాధ్యతలు తీసుకుని ఈ నెలతో ఏడాది కావస్తోంది. అయితే ఆయన్ని మంత్రి వర్గంలో తీసుకుంటారు అనే చర్చ గడిచిన సంవత్సరంగా వినిపిస్తోంది.అయితే పవన్ కల్యాణ్ మాత్రం అన్నదమ్ములిద్దరు ఇలా పదవుల్లో ఉండటం, ఒకే సామాజికవర్గం వారు పదవులు తీసుకోవడం వల్ల తప్పుడు సంకేతం వెళుతుందని, పార్టీకి నెగిటీవ్ ఇంపాక్ట్ పడుతుంది అని భావించారు.అందుకే పవన్ కల్యాణ్ ఈ విషయంలో వెనకడుగు వేస్తున్నారు.
ఇక తాజాగా నాగబాబు పేరు వినిపించడానికి ప్రధాన కారణం, ఈ ఏడాది జూన్ నెలలో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్ధానాలు ఖాళీ అవుతున్నాయి. కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి కాబట్టి కచ్చితంగా జనసేనకు ఒక స్ధానం అవకాశం వస్తుంది. మరి జనసేన తరపున ఎవరిని రాజ్యసభకు పంపుతారు అనే విషయంలో చర్చలు సాగుతున్నాయి. లింగమనేని రమేష్ పేరు వినిపిస్తున్నా, పవన్ కు అత్యంత సన్నిహితులకు పదవులు ఇస్తున్నారు అనే విమర్శ వస్తుందని పవన్ కల్యాణ్ ఆలోచన చేస్తున్నారు . లింగమనేని రమేష్ సరే అంటే, ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి నాగబాబుని రాజ్యసభకు పంపాలి అని జనసేన భావిస్తోంది.
ఎందుకంటే నాగబాబు రాజ్యసభకు వెళితే పార్టీకి గట్టి మైలేజ్ ఉంటుంది. నమ్మకస్తుడు పార్టీ తరపున హస్తినలో రాజకీయాల్లో కీలక రోల్ పోషించవచ్చు. ఢిల్లీ వేదికగా జనసేన రాజకీయాలకు కీలకమవుతారు నాగబాబు.అంతేకాకుండా కేబినెట్ లో బెర్త్ దక్కే అవకాశం ఉంటడంతో నాగబాబు అయితే బాగుంటుందని పవన్ కల్యాణ్ ఆలోచన.. మరోపక్క బీసీ సామాజిక వర్గం నుంచి కొణతాల రామకృష్ణ పేరు వినిపిస్తోంది. అయితే నాగబాబు ముందు నుండి ఎంపీగా పోటీ చేయాలని భావించారు.
ఎందుకంటే 2019 ఎన్నికల సమయంలో కూడా తమ కుటుంబానికి ఎంతో పేరు ఉన్న నరసాపురం లోక్ సభ సెగ్మెంట్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. కానీ ఓటమిపాలయ్యారు. 2024 లో అనకాపల్లి నుంచి పోటీ చేయాలి అని భావించారు కానీ బీజేపీ కోరడంతో ఆయన త్యాగం చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆయనకు రాజ్యసభ హామీ ఉంది, పైగా ఆయన త్యాగం చేసిన సీటు బీజేపీకి రావడం, అక్కడ గెలవడంతో కచ్చితంగా నాగబాబు అయినా ఇంకా భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉండేదని జనసేన వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.
2024లో రాజ్యసభ అవకాశం వచ్చినా ఆనాడు నాగబాబు పేరు వినిపించలేదు. తాజాగా నాగబాబుని ఈ సారి రాజ్యసభకు పంపాలని, కేబినెట్ లోకి తీసుకోవాలని కోరుకుంటున్నారు. మరి దీనికి బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే కచ్చితంగా ఆ కోరిక కూడా తీరనుంది.
పవన్ కు రాజకీయంగా దశాబ్దకాలంగా వెన్నంటి ఉన్న నాగబాబుకి ఆ పదవి ఇవ్వడం కరెక్ట్ అంటున్నారు జనసేన అభిమానులు. మరి మీ అభిప్రాయమేమిటో తప్పక కామెంట్లో తెలియచేయండి.

