బీహర్ రాజకీయాలు ఎప్పుడూ చర్చనీయాంశమే. తాజాగా ఇప్పుడు మరోసారి బీహార్ పాలిటిక్స్ హాట్ టాపిక్ అయ్యాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. ఆయన రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయడంతో రాజ్యసభకు వెళ్లనున్నారు. ఆ తర్వాత ఆయన కేంద్ర కేబినెట్ లో చేరే అవకాశం ఉంది, మరి ఇప్పుడు బీహర్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనేది ఆసక్తి రేపుతోంది. రాజకీయ సమీకరణాలు చూస్తే ఈసారి బీహార్ పీఠం బీజేపీకి దక్కే అవకాశం ఉంది. అక్కడ తమ పార్టీని ముందుకు నడపాలంటే వచ్చిన ఈ అవకాశం వదులుకోకూడదు అని బీజేపీ కూడా ఆలోచన చేస్తోంది.
బీహర్ లో మొత్తం 243 స్ధానాలు ఉన్నాయి. దాదాపు గత ఎన్నికల్లో 202 స్ధానాలు ఎన్డీయే కూటమి గెలుచుకుంది. ఎక్కువ సీట్లు బీజేపీ గెలిచింది. మొత్తం సీట్లలో 89 స్ధానాలు బీజేపీ గెలవగా, జేడీయూ 85 స్దానాలు గెలిచింది. సీనియర్ అవ్వడం అప్పటి రాజకీయ సమీకరణాలతో నితీష్ ని సీఎంగా ఎన్నికుంది ఎన్డీయే. తాజాగా ఆయన రాజ్యసభకు రానుండటంతో ఇక బీజేపీ ఆ పదవి చేపట్టనుంది.
ఇప్పటికే నాగపూర్ వేదికగా ఓ పేరు ఫైనల్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు కృషి చేసిన వారికి అవకాశం ఇవ్వాలి అని బావిస్తున్నారు కమలం పార్టీ పెద్దలు.
బీహార్ ప్రస్తుత డిప్యూటీ సీఎంగా ఉన్న సామ్రాట్ చౌదరి సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆయన కష్టం చూసి ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. ఆయనపై ఎలాంటి విమర్శలు ఆరోపణలు లేవు. అంతేకాదు అందరిని కలుపుకుపోయే మనస్ధత్వం ఆయనకు ఉంది అందుకే ఆయన పేరు బాగా వినిపిస్తోంది.
బీహార్ కుల సమీకరణాలు చూస్తే మెజార్టీ యాదవ వర్గం ఉంది. ధనవంతులు రాజకీయ నేతలు వారే, ఆ తర్వాత కుష్వాహా సామాజిక వర్గం ఉంది ఆ వర్గానికి చెందిన నాయకుడు సామ్రాట్ చౌదరి .. రాష్ట్రంలోని ఓబీసీల్లో కుష్వాహాలు ఎక్కువగా ఉన్నారు . అయితే నితీష్ కూడా ఆయన ఎన్నికపై ఒకే చెబుతారు అనే మాట వినిపిస్తోంది.
ఇక రెండో పేరు ప్రస్తుతం కేబినెట్ లో హోంశాఖ సహాయమంత్రిగా ఉన్న నిత్యానందరాయ్ పేరు వినిపిస్తోంది. ఆయనకు రాష్ట్రంలో బీజేపీలో మంచి పట్టు ఉంది. గతంలో బీజేపీ అధ్యక్షుడిగా చేసిన అనుభవం ఆయన సొంతం. అంతేకాదు హాజీపూర్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం నిత్యానందరాయ్ కు ఉంది. ఆయన సామాజికవర్గం కూడా దగ్గర అవుతుంది అనే ఆలోచన కూడా కనిపిస్తోంది.
ఇక మూడో నాయకుడు దిలీప్ కుమార్ జైస్వాల్ ఆయన మండలికి మూడు సార్లు వెళ్లారు, అంతేకాకుండా బీజేపీ చీఫ్ గా కూడా ఆయన పనిచేశారు సీనియర్ నేత కావడం ఆయన పేరు బలంగా వినిపిస్తోంది. అంతేకాకుండా మరో నలుగురి పేర్లు తెరపైకి వచ్చాయి. విజయ్ కుమార్ సిన్హా, నితీష్ మిశ్రా, రామ్ కృపాల్ యాదవ్, జనక్ రామ్ కానీ అధిష్టానం మాత్రం డిప్యూటీ సీఎంని ముఖ్యమంత్రి చేయాలి అని ఆలోచనగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
గతంలో మనం చూశాం, రాజస్ధాన్, గుజరాత్, ఛత్తీస్ ఘడ్ లో ఇలాగే అన్నీ సమీకరణాలు ఆలోచించి నిర్ణయం తీసుకుంది కాషాయపార్టీ. ఇప్పుడు కూడా ఇదే ఫార్ములా బీహార్ లో కమలం పార్టీ అమలు చేస్తుందంటున్నారు.
ఇవన్నీ ఇలా ఉండగా ఎన్నడూ రాజకీయాల్లోకి రాని నితీష్ కుమార్ తనయుడు నిషాంత్ కుమార్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తండ్రి పార్టీలో చేరి జేడీయూ సభ్యత్వం తీసుకున్నారు. సో ఆయనని మండలికి పంపి డిప్యూటీ సీఎంగా తీసుకుంటారు అనే చర్చ సాగుతోంది. కుమారుడి ఎంట్రీతో నితీష్ రెండో తరం కూడా రాజకీయాల్లోకి వచ్చినట్లైంది.

