2024 ఎన్నికల్లో ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి నామినేటెడ్ పోస్టుల్లో తమ వారికి మంచి ప్రాధాన్యత ఇచ్చారు. టికెట్లు రాని వారు రాజ్యసభ, ఎమ్మెల్సీ అవకాశాలు పొందారు. అయితే ఏ రాజకీయ పార్టీ అయినా గ్రామాల నుంచి పటిష్టం అవ్వాలి, అక్కడ పార్టీ బలంగా ఉంటే ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యతని చూపిస్తాయి. అందుకే స్ధానిక సంస్దల ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. ముఖ్యంగా ఇటీవల తెలంగాణలో కూడా ఈ ఎన్నికలు జరిగాయి. మున్సిపల్ ఎన్నిక్లలో మూడు పార్టీల మధ్య ముక్కోణపు పోటీ జరిగింది.
ఇక ఏపీలో ఎప్పుడు ఈ స్ధానిక సమరం అంటూ అందరూ ఎదురుచూస్తున్నారు. ప్రత్యేక అధికారుల పాలనతో సాగతీతపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే మున్సిపల్, మేజర్ గ్రామ పంచాయతీలు, పంచాయతీల్లో పనులు ముందుకు సాగవు. సాగినా నత్తనడకన సాగుతాయి. అందుకే పంచాయతీకి ప్రెసిడెంట్ ఇక మున్సిపాలిటీ చైర్మన్ ఉంటే ఆ పనులు వేగం పెరుగుతాయి.
అయితే ఈ ఎన్నికల గురించి ఓ గుడ్ న్యూస్ ఏపీలో వినిపిస్తోంది. వచ్చే ఆరు నెలల్లో ఏపీలో స్దానిక సంస్దల ఎన్నికలు నిర్వహించనున్నారు. కేబినెట్ భేటీ తర్వాత చంద్రబాబు మంత్రులతో దీనిపై సమావేశం నిర్వహించారు. కచ్చితంగా స్ధానిక సంస్దల ఎన్నికల్లో మనం గెలవాలని,కూటమి అభ్యర్దుల గెలుపు బాధ్యత మొత్తం ఇంచార్జ్ మంత్రులు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
ఆనాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2021 మార్చిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ పాలక వర్గాలు కొలువు తీరాయి. ఇక గడువు ముగుస్తోంది. దీంతో ఈ ఎన్నికలకు సిద్దం కావాలి అని తెలిపారు.ఇక 2026 మార్చికి పరిపాలన ఏడాది ముగుస్తుంది అందుకే 2025-26 కి సంబంధించి ఎమ్మెల్యేలు మంత్రులు కార్యదర్శుల పనితీరుపై ఓ రిపోర్టు ఇస్తామని తెలియచేశారు చంద్రబాబు . మంత్రులు కచ్చితంగా క్షేత్రస్దాయిలో ఉండాలని. మీరు గెలిచిన ప్రాంతాలను అశ్రద్ద వహించవద్దని, ప్రతీ వారానికి రెండు రోజులు నియోజకవర్గంలో సమస్యలు తెలుసుకుని పరిష్కారం దిశగా పనిచేయాలి అని కోరారు.
ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. అయినా ప్రజల్లోకి వీటిని బలంగా కొందరు నాయకులు తీసుకువెళ్లలేకపోతున్నారని మంత్రులపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా మనం చేసే పనిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని, కొందరు మంత్రులు ఈ విషయంలో వెనక బడ్డారు అనే విషయాన్ని తెలిపారు. పార్టీ కార్యాలయం నుంచి వచ్చే సమాచారం కూడా సోషల్ మీడియా ద్వారా వేగంగా ప్రచారం చేయాలని తెలిపారు నారాలోకేష్.
మొత్తానికి ఇప్పటికే ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న పంచాయతీలు మున్సిపాలిటీలతో పాటు, గడువు ముగిసే పంచాయతీ మున్సిపల్ పోరుకి ప్రభుత్వం ఎన్నికలకు రెడీ అవుతోంది అనేది స్పష్టం అవుతోంది.

