ఇటీవల టాలీవుడ్ లో వరుస విషాదాలు మనసుకి బాధ కలిగిస్తున్నాయి. చాలా మంది ప్రముఖులు మన నుంచి దూరం అయ్యారు. పలువురు అనారోగ్య సమస్యలతో కన్నుమూస్తే మరికొందరు ప్రమాదాలు ఆత్మహత్యలతో కన్నుమూశారు. తాజాగా టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు శివాజీ రాజా ఎంతో బాధలో ఉన్నారు. ఆయన కుటుంబంలో విషాదం జరిగింది. శివాజీరాజా తండ్రి జి రామరాజు కన్నుమూశారు ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని మధురానగర్ లో తన నివాసంలో ఆయన కన్నుమూశారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. వయోభారంతో కొద్ది నెలలుగా ఆయన బాధపడుతున్నారు. వయసు రిత్యా కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, ఆరోగ్య పరిస్దితి విషమించడంతో ఉదయం కన్నుమూశారు.

శివాజీ రాజా టాలీవుడ్ లో చాలా సీనియర్ నటుడు, 30 ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఉంటున్నారు. అయితే ఆయన ఇంట ఇలా విషాదం నెలకొనడంతో చాలా మంది ప్రముఖులు ఆయనని పరామర్శిస్తున్నారు.ఆయన తండ్రి భౌతికకాయం ప్రజల సందర్శనార్దం ఇంటి దగ్గర ఉంచారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల లోపు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలియచేశారు. ఈ వార్త విన్న వెంటనే పలువురు ప్రముఖులు ఆయనను ఫోన్ లో పరామర్శించారు. పలువురు నిర్మాతలు, దర్శకులు తోటి నటులు ఆయన నివాసానికి వెళ్లి సంతాపం ప్రకటించారు. తండ్రి మరణంతో శివాజీ రాజా కుటుంబం ఎంతో ధుఖంలో ఉన్నారు.

శివాజీ రాజాకి నటన అంటే ఎంతో ఇష్టం. ఆయన సినిమా పరిశ్రమలోకి రావడానికి తండ్రి ఎంతో సహకరించారు.నటుడుగా 1985లో చిత్రరంగ ప్రవేశం చేశారు శివాజీరాజా. సౌత్ ఇండస్ట్రీలో మొత్తం 250 సినిమాల్లో నటించారు. కళ్లు సినిమాకి ఉత్తమ నూతన నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. అమృతం సీరియల్ ఆయనకు మరింత పేరు తెచ్చిపెట్టింది. మాటీవీలో సంబరాల రాంబాబు అనే సీరియల్ కూడా ఎనలేని పేరు తెచ్చిపెట్టింది. శివాజీ రాజా ఫిబ్రవరి 26, 1962 న రామరాజు, చంద్రావతి దంపతులకి పశ్చిమగోదావరి జిల్లాలో జన్మించారు. ఆయన తండ్రి ప్రముఖ కళాశాల డీఎన్ ఆర్ లో ఉద్యోగం చేసేవారు. శివాజీరాజా ప్రాధమిక విద్య పూర్తి చేసి, హైదరాబాద్ వచ్చి ఇక్కడ పాలిటెక్నిక్ పూర్తి చేశారు, తర్వాత నటుడు అవ్వాలనే కోరికతో నటనలో శిక్షణ తీసుకుని నటుడిగా తన ప్రస్ధానం మొదలుపెట్టారు.
తండ్రి మరణంతో ఎంతో బాధలో ఉన్న ఆయనకు ఆ దేవుడు మనోదైర్యం కలిగించాలి అని మనం కూడా కోరుకుందాం.

